హిందీ సాహిత్య చరిత్ర - 3

 

                         హిందీ సాహిత్య చరిత్ర - 3 

హిందీ మూలం :  డా. ఋషభ్ దేవ్ శర్మ

తెలుగు అనువాదం :  డా. యస్.వి.యస్. యస్. నారాయణ రాజు

हिंदी मूल :  डॉ. ऋषभ देव शर्मा

                   तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू

स्रवंति / స్రవంతి                                                                       

अक्तूबर 2003   / అక్టోబరు 2003

       ( హిందీ సాహిత్య విశేషాలను తెలుగు పాఠకులకు, తెలుగు సాహిత్య రీతులు మరియు తీరుతెన్నులను గురించి హిందీ పాఠకులకు అందించి తద్వారా జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడమే స్రవంతి ద్విభాషా మాసపత్రిక యొక్క లక్ష్యము. ఈ లక్ష్య సాధనలో ఒక భాగంగా  హిందీ సాహిత్య చరిత్రను తెలుగు పాఠకులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ శీర్షకను ప్రారంభించడం జరిగింది. హిందీలో ఉచ్ఛ శిక్ష ఔర్ శోధ్ సంస్ధాన్, హైదరాబాద్ శాఖ రీడర్ డా. ఋషభ్ దేవ్ శర్మ గారు వ్రాసిన హిందీ సాహిత్య కీ రూప్ రేఖా ను తెలుగులో హిందీ సాహిత్య చరిత్ర పేరిట డా. యస్.వి.యస్.యస్. నారాయణ రాజు గారు అనువాదం చేశారు. ఇకపై ప్రతి నెలా హిందీ సాహిత్య చరిత్రను అధ్యయనం చేసి సంపూర్ణ హిందీ సాహిత్య చరిత్రను గూర్చి తెలుసుకునేందుకు వీలుగా క్రమంగా ప్రచురించడం జరుగుతుంది.                                                                                                                                              సంపాదకులు)

 

   ఆదికాలపు ప్రవృత్తులు :-

        ఆదికాలానికి సంబంధించిన సంపూర్ణ సాహిత్యాన్ని అధ్యయనం చేస్తే తెలియవచ్చేదేమిటంటే ఈ కాలంలో అనేక రకమైన ప్రవృత్తులు ప్రముఖంగా కన్పిస్తాయి. ఆదికాలము సాహిత్యం అనేక విషయాలు అనేకరకలైన కావ్యాలు విభిన్న కావ్య భాషా పద్ధతులలో సమ్మిళితమై అత్యంత వైవిధ్యంతో కూడుకుని ఉన్నటువంటిది. కాని అనేకమయిన అంతరంగ లక్షణాలు ఆలోచనలతో, మాండలికాలతోను ప్రారంభమయి ఒక సమగ్రమయిన రచనా విధానానికి నాంది పలికినది (డా. రామస్వరూప్ చతుర్వేది)

   సాధారణంగా ఏదో ఒక ముఖ్యప్రవృత్తి ద్వారా దానికి సంబంధించి ప్రజలందరి గురించి తెలుసుకోవాలంటే ఆయా కవుల యొక్క రచనల ద్వారా తెలుసుకొనవచ్చును. ఆదికాలము అత్యంత అరాజకపరిస్థితులతో కూడినటువంటి రాజకీయ పరిస్థితులు, మతపరంగా అత్యంత భయంకరమైన పరిస్థితులు, తిరోగమన పథంలో నున్న ఆర్థిక వ్యవస్థ, నిరంతరం దుఃఖాల సుడుగుండాలతో నిండిన సామాజిక వ్యవస్థ సంకరమవుతున్న సాంస్కృతిక పరిస్థితులతో  నిండినటువండి హిందీ భాష ప్రజలలో ఉదాసీనత, పాపపుణ్యాల చింతిన మరియు అస్థిత్వము కొరకు పోరాడతుండటం వలన అత్యంత పరస్పర విభిన్న ప్రవృత్తులతో కూడిన సాహిత్య రచనలు రావడం అత్యంత  స్వాభావికమయిన విషయం. దీని ఫలితంగా ఆనాటి సాహిత్యంలో విలాస, త్యాగ మరియు సంఘర్షణతో కూడిన ప్రవృత్తులు ఉద్భవించాయి. ఇవి సిద్ధులు, నాథ్ లు, జైన్ లు సాహిత్యాలతో పాటు రాసో కావ్యాలు మరియు ఆనాటి సాధారణ సాహిత్య రచనలలో ప్రస్ఫుటించాయి.

(1) సిద్ధ సాహిత్యము :- తూర్పు హిందీ భాషా క్షేత్రంలో బౌద్ధమతం యొక్క వజ్రయానం ప్రచారం చాలా ఎక్కువగా జరిగినది. ఈ వజ్రయానాన్ని సిద్ధ్ అని కూడా పిలుస్తారు. 84 సిద్ధులు అప్పటి ప్రజల వాడుక భాష అయినటువంటి అపభ్రంశ్ భాషలో వారి వారి కావ్యరచనలు కావించారు. ఈ రచనలు యొక్క అసలు ప్రతులు ఇప్పుడు లభించనప్పటికి టిబెట్ భాషలోని అనువాదాలు మాత్రమే వీటికి ఆధారం. వాస్తవంగా ఈ సిధ్ధ సాహిత్యాన్ని హిందీ సాహిత్యపు ఆదికాలంలోనే కాకుండా అపభ్రంశ్ సాహిత్యంలోని భాగంగా పరిగణించాలి. ఇక్కడ కేవలం హిందీ సాహిత్య చరిత్ర యొక్క పరంపరను తెలుసుకోవడం కోసం మాత్రమే ఆదికాలపు సాహిత్యానికి చెందిన ఒక ప్రవృత్తిగా పరిగణించడం జరిగినది. 84 మంది సిద్దులలో సరహపా, శభరపా, లుయీపా, డోంభిపా, కంఠప్పా మరియు కుక్కురిపా మొదలయినవారు ముఖ్యులు. 

సరహపా :- ఇతడు క్రీ.శ. 769 కి చెందినవాడు. సరహపాథ్, సరోజవజ్ర్, రాహల్ భద్ర్, శరహస్తపాథ్ మరియు సరహ్ పేర్లుతో వ్యవహరించబడే ఈ సరహప వజ్రయాన సిద్దులలో అత్యంత ప్రాచీనుడు. ఇతడు బ్రాహ్మణుడు మరియు ప్రారంభంలో నలంద విశ్వవిధ్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు. అక్కడ ఉన్నటువంటి కలుషిత వాతావరణంలో ఇమడలేక బౌద్ధ భిక్షువుగా ఉన్న సరహపా దాన్ని వదిలి బాణాలు తయారు చేసే నిమ్న జాతికి చెందిన మహిళను స్వీకరించి సహ్యయాన మార్గాన్ని స్వీకరించాడు. కమల కలశ సాధన ద్వారా స్త్రీ సహవాసముతో లభించేటటువంటి ఆనందాన్ని మూడులోకాలలోని అలౌకిక సుఖము మరియు విలాసము అని చెప్పటమేకాక బాహ్యాడంబరములను వ్యతిరేకించి గురువు యొక్క మహిమను మరియు సహజ మార్గాన్ని ప్రతిష్టించాడు. ఇతడు దోహాకోశ్ తో పాటు 32 గ్రంథాలను రచించాడు. ఇతని యొక్క భావాలు మరియు కవిత్వ ధోరణి యొక్క వికాసము కబీర్ మొదలయినటువంటి వారి రచనలలో కన్పిస్తుంది.

శబరపా (క్రీ.శ. 780) :- ఇతడు క్షత్రియ వంశస్థుడు. ఇతడు సరహ్ యొక్క శిష్యుడు. శబర్ జాతికి చెందిన వాడిలాగ జీవించటంతో శబరపాగా పేరు పొందారు. తన చర్యాపద్ రచనలో మాయను వ్యతిరేకించి నిర్వాణం కొరకు తన గురువు యొక్క సహజ జీవన విలాస మరియు భోగ మార్గాన్ని ప్రతిపాదించాడు.

లుయిపా :- ఇతడు 84 మంది సిద్దులలో అగ్రగణ్యుడు. ఇతడు కాయస్థ కులస్థుడు. శబరపా యొక్క శిష్యుడు. ఒరిస్సా దేశపు రాజు మరియు మంత్రి కూడా ఇతని శిష్యులే. ఇతని యొక్క పద్యాలలో రహస్య భావన ముఖ్యమైనది.

డోంభిపా (క్రీ.శ.840) : ఇతడు మగదదేశపు క్షత్రియుడు. ఇతని యొక్క గురువు విరూపా. గురువు యొక్క మహిమ భోగసాధన గూర్చి వర్ణించినటువంటి 21 గ్రంథాలను రచించాడు. ఇందులో డోంభి గీతికా, అక్షర గీతోపదేశ్ మరియు యోగచర్చా మొదలైనవి ప్రసిద్ధి చెందినవి.

కణ్హపా (క్రీ.శ.820) :ఇతడు కన్నడ బ్రాహ్మణుడు. జాలంద్ నుంచి దీక్షను స్వీకరించాడు.  ఇతడు పేరు మీదుగా 74 గ్రంథాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ గ్రంథాలలో తత్వశాస్త్రము, రహస్యభావన మరియు మూఢనమ్మకాల ఖండన ప్రముఖంగా ఉన్నాయి.

కుక్కురిపా : కపిలవస్తుకు చెందిన బ్రాహ్మణుడు. చర్పటీపా యొక్క శిష్యుడు. ఇతడు 16 గ్రంథాలను రచంచాడు. ఇతడు సహజ జీవన విధానాన్ని సమర్థించాడు.

 సిద్ధ సాహిత్యం అప్పటి ప్రజల భాషలో రచించినటువంటి కావ్యాలు. వాటిలో హిందీ భాష యొక్క ఆరంభ లక్షణాలు గోచరిస్తాయి. ఈ కావ్యాలన్నింటిని సిద్ధమతము యొక్క ప్రచారం కొరకే వ్రాయడం జరిగినది. అయినప్పటికి ఇందులో తత్త్వబోధ ఆధ్యాత్మిక చింతన మరియు రహస్య భావనలతో నిండి ఉండటంవల్ల ఇందులో కవిత్వ లక్షణాలు సమ్మిళతమయినాయి. ఈ కావ్యాలు మత మరియు సమాజంలో నున్నటువంటి మూఢనమ్మకాలను ఎండగట్టే కావ్యభాషను నిర్మించాయి. మరియు యోగసాధనవంటి రహస్య విషయాలపైన ప్రజలలో చర్చ జరిగేటువంటి వాతావరణాన్ని నిర్మించాయి. భిక్షక ప్రవృత్తి నుండి సహజ జీవన మార్గాన్ని సమర్ధించడం ఈ కావ్యాల యొక్క ముఖ్య లక్షణం.

(2)  జైన సాహిత్యం :-   పశ్చిమ హిందీ భాషా క్షేత్రంలో ఆదికాలంలో జైన మత ప్రచారం కొరకు జైన సాహిత్యాన్ని రచించే ప్రక్రియ ప్రారంభమయినది. దీని ప్రారంభం స్వయంభు రచించిన పఉమచరిఉ (క్రీ.శ.789) దేవసేన్ రచించిన శ్రావకాచార్ (క్రీ.శ.933) మరియు పుష్పదంత్ యొక్క మహాపురాణం (క్రీ.శ.10 వ శతాబ్దం) మొదలయినటువంటి అపభ్రంశ కావ్యాల ద్వారా జైన సాహిత్యం ప్రారంభయినది. ఆదికాలానికి చెందిన మొట్టమొదటి ప్రామాణిక రచనగా స్వీకరించిన భరతేశ్వర్ బాహుబలిరాస్ హిందీలోని జైనసాహిత్యం యొక్క ప్రథమ రచనగా భావించబడుతుంది. ఈ పరంపర ఆదికాలము యొక్క చివరి వరకు (క్రీ.శ.1350) 11 రాస్ కావ్యాలు లభించినాయి. ఇదే సమయంలో నాలుగు జైన ఫాగూ కావ్యాలు కూడా లభించినాయి. ఈ విధంగా హిందీ సాహిత్యపు ఆదికాలము వాస్తవిక ప్రారంభం జైన సాహిత్యంతోనే ప్రారంభమయింది. దీనికి సంబంధించిన 15 గ్రంథాలు లభ్యమయినాయి.

  జైన మతమును ప్రచారం చేయటం కోసం జైన సాధువులు ప్రజల వాడుకభాషను మాధ్యమంగా చేసుకుని వారి రచనలను కొనసాగించారు. ఇందులో ఎక్కువమంది రాస్ శైలిని అత్యంత ప్రజాదరణ పొందినదిగా గుర్తించి అదే శైలిలో ఎక్కువ రచనలు చేశారు రాస్ ఒక సాహిత్య రూపము ఇందులో సాధారణ ప్రజల ఆటపాటలు, నృత్యాలు మొదలైనటువంటి వాటి ద్వారా రాస్ లీలలను రచించి సాధారణ ప్రజలను ఆకర్షించడం జైన సాధువులకు చాలా సులభతరమయినది. ఇదే విధంగా ఫాల్గుణ మాసంలో వసంతోత్సవానికి సంబంధించిన పాటల రూపంలో కూడా జైన సాహిత్యాన్ని రచించారు. వీటిని ఫాగూ కావ్య్ అని కూడా అంటారు. ప్రజల భాష మరియు సాధారణ జన శైలుల అద్భుత సమ్మిశ్రణం యొక్క ఉత్కృష్ట రూపం జైన సాహిత్యంలోని కన్పిస్తుంది.  ఇందులో శ్రోత లేదా ప్రేక్షకులను ఆకర్షించే శక్తి ఉన్నది. ఈ రచనలు జైనమందిరాలలో తప్పనిసరిగా వివిధ వాయిద్వాల సహకారంతో నర్తిస్తూ,  పాడుతూ వీటిని ప్రదర్శించేవారు. శాలి భద్రసూరి, ఆసగు, జిన్ ధర్మసూరి, సుమతిగణి మరియు విజయ్ సేన్ సూరి యొక్క రాస కావ్యాలతోపాటు నాలుగు జైన ఫాగూ కావ్యాలలో ఈ ప్రవృత్తి కన్పిస్తుంది.

    జైన రాస కావ్య పరంపరలో మొట్టమొదటి గ్రంథం భరతేశ్వర్ బహుబలిరాస్ ను క్రీ.శ.1184లో శాలి భద్రసూరి రచించాడు. 205 పద్యాలతో కూడిన ఈ ఖండకావ్యంలో జైనమతం యొక్క ప్రథమ తీర్థంకరుడు ఆదినాథ్ ఋషభ్ దేవ్ యొక్క కూమారులైన భారత్ మరియు బాహుబలుల యొక్క సంఘర్షణను అత్యంత రమణీయంగా వర్ణించాడు. ఈ కావ్యంలో వీర, శృంగార మరియు శాంతి రసాల యొక్క త్రివేణీ సంగమం కన్పిస్తుంది. భావాలకనుగుణంగా భాషను ఉపయోగించారు. జవోజ ప్రసంగంలోని దిగువ పద్యాన్ని ఉదాహరణగా చెప్పవచ్చు.

బోల్హ బాహుబలి బలవంత్

లోహ్ ఖండితఉ గరివీఉహంత్

చక్రసరీసఉ చూనడ్ కరిఊ

సమలహే గోత్రహ కుల్ సంహరఉ

   సన్యాస ప్రసంగంలోని భాష పూర్తిగా విరక్తి మరియు ఆత్మగ్లానికి అనుకూలంగా ప్రయోగించటం జరిగింది.

ధిగ్-ధిగ్! ఏఏయ్ సంసార్, ధిగ్-ధిగ్!

రాణిమరాణ్ రిహి,

ఏవడు ఏ జీవ్ సంహార్,

కీధఉ కుణ్ విరోధవ సి?”

 కవి ఆసగు రచించిన చందన బాలారాస్ (క్రీ.శ.1200) 35 పద్యాలతో నిండిన చిన్న ఖంఢ కావ్యము. ఇందులో చంపాదేశపు రాజు ధధివాహనుడి కుమార్తె అయిన చందన బాలకథను వర్ణించడం జరిగింది.  కొందరు దురాక్రమణదారుల రాజకుమారి చందనబాలను అపహరించి ఒక వ్యాపారికి అమ్మివేస్తారు. అతని చేతిలో అనేక కష్టాలు అనుభవించినప్పటికీ తన పాతివ్రత్యాన్ని నిలువరించుకోవడమే కాకుండా మహావీర్ తీర్థంకరుడు నుండి దీక్షను పొంది మోక్షన్ని సాధిస్తుంది. ఈ రాసకావ్యంలోని మొత్తము కధ అత్యంత కరణరసంతో నిండిన మహత్తర గ్రంథంగా గుర్తింపు పొందినది.

 జిన్ ధర్మసూరి రచించిన స్థూలిభద్రరాస్ (క్రీ.శ.1209)లో మునిస్ధూలిభద్ర్ మరియు వేశ్య అయిన కోశా మధ్య నడిచిన ప్రణయ గాథలో భోగవిలాసాలు మరియు విగ్రహముల మధ్య సంఘర్షణను అద్భుతంగా వర్ణించారు. పూర్తిగా ఆధ్యాత్మిక భావనలతో నిండిన ఈ కావ్యము అత్యంత ప్రసిద్ధి చెందినది.

  సుమతిగణ్ రచించిన నేమినాథ్ రాస్ (క్రీ.శ. 1213) యాభై ఎనిమిది పద్యాలతో కూడిన కావ్యము. ఇందులో జైన తీర్థంకరుడు అయిన నేమినాథ్ యొక్క చరిత్రను చక్కగా వర్ణించాడు.

 విజయ్ సేన్ సూరి రచించిన రేవంత్ గిరి రాస్ (క్రీ.శ.1231)లో నేమినాథ్ తీర్థంకరుడి యొక్క ప్రతిభాపాటవాలను రేవంత్ గిరి తీర్థాన్ని గురించిన వర్ణన ఉన్నది. ఈకావ్యంలో అత్యంత సహజమైన ప్రకృతి చిత్రణ కన్పిస్తుంది.

 జిన్ చంద్ సూరి ఫాగు (అజ్ఞాతరచయిత) సిరిభూలిభద్రఫాగు (జిన్ పద్మసూరి) శ్రీనేమినాథ్ ఫాగు (రాజశేఖర్ సూరి) మరియు వసంత విలాస ఫాగు (అజ్ఞాతకవి) రచనలు ఆదికాలపు జైన ఫాగూ కావ్యాలుగా ప్రసిద్ధికెక్కాయి. అప్పటి తత్కాలపు శైలుల కనుగుణంగా ఫాగు గీతాల ద్వారా జైన తీర్థంకరుల చరిత్రలను మరియు జైన మతప్రచారాన్ని చేశారు. సందర్భానుసారంగా కధానాయికల యొక్క రూప సౌందర్యము, యవ్వనము మరియు ప్రేమ సంబంధమయిన అనేక అంశాలను ఈ కావ్యంలో కడురమ్యంగా వర్ణించడం జరిగింది.

(3) నాథ్ సాహిత్యము  :-  సిద్ధుల యొక్క నామ మార్గానికి వ్యతిరేకంగా నాథ్ సాంప్రదాయం ఉద్భవించినది. ఇందులో భోగమార్గానికి బదులుగా యోగమార్గము, సహజసాధనకు బదులుగా హఠ సాధనము, విలాసానికి బదులుగా బ్రహ్మచర్యాన్ని ప్రతిపాదించటం జరిగింది. నాథ్ సాంప్రదాయాన్ని సిద్ధమతము, సిద్ధమార్గము, భోగమార్గము, యోగ సాంప్రదాయము మరియు అవధూత మతము అని కూడా పిలుస్తారు. నాథ్ సాహిత్యానికి ఆదిపురుషుడైన గోరఖ్ నాథ సిద్ధ్ పరంపరను స్వీకరించిన మత్స్యేంద్రనాధ్ శిష్యుడు. గోరఖ్ నాధ్ ఏ కాలానికి చెందినవాడు అనే విషయంపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొత్తగా లభించిన సాక్ష్యాలు ఆధారంగా గోరఖ్ నాధ్ 13వ శతాబ్దానికి చెందినవాడని నిర్ధారించడం జరిగింది. ఆయన రచించిన గ్రంథాలు 14గా గుర్తించడం జరిగింది. అవి – సచది, పథ్, ప్రాణసంకలి, సిస్యాదర్సన్, నరవైబోద్, అభయ్ మాగా జోగ్, ఆత్మబోధ్, పంద్రహ్ తిథి, సప్తబార్, మచీంద్ర గోరఖ్ బోద్, రోమవలి, జ్ఞానతిలక్, జ్ఞానచేంతీన్, పంచమాత్ర మొదలయినవి. గోరఖ్ నాథ్ నిర్మాణ్ సిద్ధ్, శైవ, శాక్త, బౌద్ధ, జైన మరియు వైష్ణవ యోగ మార్గాలను కలిపి నాధ్ సాంప్రదాయాన్ని నిర్మించాడు. గురుమహిమ, ఇంద్రీయ నిగ్రహము, ప్రాణ సాధన, వైరాగ్యము, మనః సాధనా, కుండలినీ, శూన్య సమాధి మరియు నీతికి సంబంధించిన గోరఖ్ బోధనలలో జీవన అనుభూతికి సంబంధించిన సాధన గూర్చి వివరంగా ఉంది. తన యొక్క హఠయోగ సాధన మరియు షట్చ్కక్ర యోగమార్గం ద్వారా గోరఖ్ నాథ్, జ్ఞానమార్గ, సంత కవులకు పూర్వరంగాన్ని సిద్ధం చేశాడు. ఇతని కావ్యాభాషా వికాసం కబీర్ యొక్క సాఖీలలో ప్రస్ఫుటమైనది. కబీర్ రచించి వ్యతిరేకోక్తులుకు ప్రారంభపీఠిక గోరఖ్ నాథ్ రచనలలో కన్పిస్తుంది.

నే లభ్ పాతరి, ఆగే నాచైం, ఫీఛ్ సహజ అభాడా!

ఐ సే మన్ లై జోగి ఖేల్, తబ్ అంతరి, బసై భండారా.

 నాథ్ సాహిత్య పరంపర వికాసానికి కృషి చేసి గోరఖ్ నాథ్ శిష్యులు చౌరంగినాథ్, గోపిచంద్, చుణకర్ నాధ్, భరతరి మరియు జలంధరి మొదలైనటువంటివారు ప్రముఖులు. 

 

 

 

 

 

 

 

Popular posts from this blog

वैज्ञानिक और तकनीकी हिंदी

“कबीर के दृष्टिकोण में गुरु”

लहरों के राजहंस और सुंदरी