గ్రీష్మం తర్వాత వసంతం
గ్రీష్మం తర్వాత
వసంతం
మణిపురి మూలం :
డా. చోం. యామినిదేవి
मणिपूरि मूल : डॉ. चों.
यामिनि देवी
హిందీ అనువాదం : డా. ఇ.విజయలక్ష్మీ
हिंदी अनुवाद : डॉ. इ.
विजयलक्ष्मी
తెలుగు అనువాదం
:
డా. ఎస్.వి.ఎస్.ఎస్. నారాయణ రాజు
तेलुगु अनुवाद : डॉ. एस.वी.एस.एस. नारायण राजू
స్రవంతి.
ద్విభాషా మాస పత్రిక,
డిసెంబరు, 2006
ఈరోజు యూనివర్సిటిలో విధ్యార్థుల వీడ్కోలు మహోత్సవం జరుగుతున్నది. అందరూ
కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఎవరికి కావలసినవి వాళ్ళు తింటూ, త్రాగుతూ సంబరాలు
జరుపుకుంటున్నారు. ఒకరికి ఒకరు బహూమతులను అందజేసుకుంటున్నారు. వీడ్కోలు తీసుకుంటూ
జేమ్స్ – “గాయత్రి! పరీక్షలు అయిపోగానే మనం ఎవరింటికి వాళ్ళు
వెళ్ళిపోవాలి. మణిపూర్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కలుస్తామనే నమ్మకం నాకు లేదు. ఈ
సమాజం మన ప్రేమను అంగీకరిస్తుందన్న నమ్మకం నాకు కలగటం లేదు.” మనం ఏం చేద్దాం?
“సమాజపు
కట్టుబాట్లులోనూ, విశ్వాసాలలోను మార్పు తీసుకువస్తూ మన పెళ్ళి జరగాలి” అని నేను కోరుకుంటున్నాను, అని గాయత్రి అంది.
“ఇది ఎలా సాధ్యం
నాకైతే అర్థం కావటంలేదు, అందరూ ఒకటే. ప్రేమ, సౌభ్రాతృత్వం వంటి మాటలు అయితే
మాట్లాడతారు. మనందరం ఒకటే అని అంటారు. కానీ మీ బ్రాహ్మాణులు మమ్మల్ని నిమ్న
వర్గాలు అంటూ ఇంటి గడపలోనికి కూడా అడుగు పెట్టనివ్వరు. అందువలన మనం ఈ సమాజం నుండి
దూరంగా వెళ్ళిపోవడమే ఉత్తమం.”
“లేదు నేను అలా
చెయ్యాలి అనుకోవడం లేదు. మన తల్లితండ్రులిద్దరూ ఒప్పుకోవాలి. పాత పద్దతులలో మార్పు
తీసుకురావడానికి మనం ప్రయత్నిద్దాం.”
“గాయత్రి నువ్వు
అందమైన దానివే కాదు, తెలివైన దానివి, సాహసవంతురాలివి కూడా, నువ్వు ఏమైన చెప్పు,
నేను ఒప్పుకుంటాను, నీ ప్రేమ కోసం నా ప్రాణాలైన ఇవ్వడానికి నేను ఎల్లప్పుడూ
సిద్దం.”
“ప్రేమ కోసం
ప్రాణాలు తోసుకోవడం మంచిపనికాదు, మనం జీవించాలి. మనం ఎవరింటికి వాళ్ళు వెళ్ళి, మన
తల్లి తండ్రులలోనూ, వారి వారి ఆచార వ్యవహారాలలోను, పద్దతులలోనూ, వారి ఆలోచనా
సరళిలోనూ మార్పు తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. తర్వాత భగవంతుని అనుగ్రహం.”
గాయత్రి తండ్రి గురుమయూమ్ నీలమణి శర్మ,
విద్యావేత్త మరియు వేదమంత్రాలు తెలిసిన సద్ బ్రాహ్మాణుడు, వేదకర్మల ఆచరిస్తూ,
పూజారి కార్యక్రమాలు ద్వారా అందరి మన్ననలు పొందుతున్న వ్యక్తి, గాయత్రి తల్లి కూడా
చదువుకున్న మహిళే కాకుండా ఎంతో చక్కగా పూజాది కార్యక్రమాలకు కావలిసిన వస్తువులను,
ప్రసాదాలను ఎంతో రుచికరంగా తయారు చేయడంలో చేయి తిరిగిన ఇల్లాలుగా చుట్టు పక్కలందరి
చేత ప్రశంసలు అందుకుంటూ వున్నది. ఇంటిని
పరిశుభ్రంగా ఉంచడంలో ఆమెకు ఆమే సాటి. వారు మతాన్ని నిష్టిత పాటించడమే కాక
అంటరానితనాన్ని కూడా పాటిస్తారు.
ఒకరోజు పండిత నీలమణిశర్మ తేరాని విధుముఖితో ఇలా
అన్నాడు.
“వింటున్నావా”
“సెలవియ్యండి
పండితులవారు”
“ఒక ముఖ్యమైన
విషయం మాట్లాడాలి, ఇలారా! చాలా
సంవత్సరాల నుండి మనమ్మాయి గాయత్రి ఇంటికి
దూరంగా ఉండి చదువుకుంటున్నది. సమయం మించకముందే అమ్మాయి పెళ్ళి చేయాలి.”
“అమ్మాయి
రీసెర్చ్ పూర్తి చెయ్యాలనే పనిలో పడి పెళ్ళి మాట వినడానికే ఇష్టపడటం లేదు. ఒకవేళ
గట్టిగా పెళ్ళి గురించి మాట్లాడితే ‘అసలు నాకు
పెళ్ళి వద్దు’ అని అంటున్నది.”
“ఒక్కగానొక్క
కూతురు, మన బ్రహ్మణ కన్యకి వయస్సు మీరితే సరియైన సంబంధం దొరకడం కష్టం అవుతుంది.
నువ్వు తల్లివి అయి ఉండి కూడా ఏమి ఆలోచించడం లేదు.”
“అయ్యా పండితులు
వారు, నేను కూడా ఆ విషయం ఆలోచిస్తూనే సతమతమవుతున్నాను. కాని అమ్మాయి ఎవరో
అబ్బాయిని ఇష్డపడుతుందని ఆమె స్నేహితురాలు సోబిత చెప్పింది.”
“మన ఏకైక ముద్దుల కూతురు. ఆమె ఇష్టయిష్టాలకు అనుగుణంగా
ఆమెకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, అదే నాకు సంతోషం. కాని ఒక్క విషయం మర్చిపోకు
మన సమాజంలోని గౌరవానికి ఏమాత్రం భంగం కలగరాదు. వెంటనే అన్ని విషయాలు అమ్మాయితో
మాట్లాడి వెంటనే విషయంతేల్చు.”
ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో నియమానుసారం జరిగే మత
ప్రవచనాలు ఇవ్వడానికి తొందరగా బయటికి వెళ్ళిపోయాడు నీలమణిశర్మ.
“గాయత్రి బంగారం! నీ స్నేహితురాలు సోబిత చెప్పింది, నువ్వు చెప్పింది,
నువ్వు ఎవర్నో ప్రేమిస్తున్నావని, ఆ అబ్బాయి నిమ్న కులస్తుండట నిజమేనా?”
“అవునమ్మా నిజమే”
“హరే కృష్ణ! హరే కృష్ణ! ఏమి
మాట్లాడుతున్నావు మన వాళ్ళు ఎవరూ నీకు దొరకలేదా” వాడిని ఎలా
ప్రేమించావే?”
“అమ్మా! ప్రేమకి కులం, మతం, భాషా, ప్రాంతాల భేదాలు ఉండవు. ఇది
మనసుకి సంబందించిన విషయం.”
“ఏయ్, ఏయ్! నువ్వు చదువుకున్నావని, మాకే పాఠాలు నేర్పిస్తున్నావా? నువ్వు పూర్తిగా మారిపోయావు.”
“నేను ఏమి
నేర్పించడం లేదమ్మా! పుస్తకాలలోనూ,
శాస్త్రాలలోనే ఇదే రాశి ఉంది. నాన్న గారూ ప్రవచనాలు చెప్పేటప్పుడు ఎప్పుడు ఇదే
చెబుతూ ఉంటారు. నువ్వు కూడా వింటుంటావు. ఆత్మ ఒక్కటే, మనందరి ఆత్మ ఒక్కటే, ఎటువంటి
భేద భావము లేదు. మనుష్యులందరూ భగవంతుని సంతానమే అని చెబుతుంటారు కదా!”
“అవి అన్ని
చెప్పడానికి, బ్రహ్మణ అమ్మాయివి అయిన నిన్ను ఆ నిమ్నకుల అబ్బాయితో ఎలా పెళ్ళి
చేస్తాం? నువ్వు తల్లి తండ్రుల గౌరవం గురించి కొంచెమైనా
ఆలోచించావా? నిన్ను
ఇంతదానిని చేసినందుకు తల్లితండ్రుల ఋణాన్ని ఇలా తీర్చుకుంటున్నావా?”
“అమ్మా! ఈరోజున దేశంలోని యువత ఇందువలనే సందిగ్దంలో చిక్కుకుని
కొట్టు మిట్టాడుతున్నారు, పెద్దలు అయిన మీరు చెప్పేది ఒకటి చేసేది వేరొకటి. నన్ను
ఇంత ప్రయోజకురాలుగా చేసినందుకు ప్రతి ఫలంగా మీఋణాన్ని ఎలా తీర్చుకోవాలి? నా జీవితాన్ని నాకు నచ్చిన విధంగా జీవించనివ్వు.”
“అయ్యో రామా! ఏమి మాటలు మాట్లాడుతున్నావు? ఏమి ఉపయోగం లేదు. మగ పిల్లలను మించి పోయావు.”
“సమాజంలోని
మీలాంటి పెద్దలే ఆడ-మగ అనే భేదాన్ని పెడుతున్నారు. మగవాడు ఏదైనా చేస్తే, మగాడులే
అని చెప్పి వదిలేస్తున్నారు. ఒకవేళ ఆడపిల్ల ఏమైనా చెయ్యాలి అనుకున్న వద్దని
వారిస్తారు. ఇదెక్కడి న్యాయం?”
“గాయత్రి! నీ ప్రేమే నాకు ముఖ్యం? అవునా?
“అమ్మో
నన్నెందుకు అర్థంచేసుకోవూ? నేను జేమ్స్ ని
కావాలనుకుంటున్నప్పుడు, ఎందుకు పెళ్ళి చేసుకోకూడదు.”
“నువ్వు
నిమ్నజాతి అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే మేము బ్రాహ్మణ జాతి నుండి బహిష్కరింపబడతాము.”
“అమ్మా! ఇలాంటి మాటలు మాట్లాడటం చాలా సిగ్గు చేటు. మనం
బ్రహ్మణులమైనంత మాత్రాన మన హోదా గొప్పది,
మనం పవిత్రులం? ఇది ఎలా? ఇతరులను కడజాతి అనడం, వాళ్ళను ముట్టుకోవడం తప్పు అనడం,
ఇదేమి విడ్డూరం? వాళ్ళు వండిన
పదార్ధాలు తినరాదు అనడం, తింటే జాతి బ్రష్టులు అవుతాం అనడం, ఇవి అన్ని ఎవరు
చెప్పారు? మన బ్రాహ్మణులమే అపవిత్రులం. అందరూ మనల్ని బయటి వాళ్ళు
అంటారు, ఆ బయట వాళ్ళు మనమే. రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనచరిత్ర మరియు మన పూర్వ
వంశస్ధుల గురించి తెలుసుకున్నాను.”
“హరే రామా! హరే రామా! ఈ పిల్ల ఏమేమి
మాట్లాడుతుంది? మీ నాన్నగారు
కాని వినలేదు కదా! అయినా నేనే
చెబుతాను.”
“అమ్మా నేను ఏమి
చెబుతున్నాను, అదంతా ఉన్నదున్నట్లుగా నాన్నగారికి చెప్పు. నాన్నగారికి అన్ని
తెలుసు. మనం బ్రాహ్మణులమని గురుమయుమేలనే గౌరవాన్ని అనుభవిస్తున్నాము. కాని మన
పూర్వీకులది గౌరు దేశము, అది ఇప్పటి పశ్చిమ బంగ్లాదేశ్ లో ఉంది. మన మణిపూర్ కు
మహరాజ్ గౌరుశ్యామ్ శాసన కాలంలో ఇక్కడికి వచ్చాం. మన పూర్వీకులు మైతే అనే జాతి
వాళ్ళను పెండ్లి చేసికొని వంశాన్ని అభివృద్ధి చేశారు, నియమాలని, కట్టుబాట్లని,
ఆచారాలని పేరు పెట్టి మనల్ని పవిత్రులుగానూ, ఇతరులను అస్పృశ్యులుగానూ చేశాం. ఇది
ఎంతవరకు సబబు?”
“సరే! అవి అన్ని వదిలేయ్, మనం ఎంతో నియమనిష్టలతో ఉంటూ మాంసం,
చేపలు తినకుండా దేవుని సేవలో ఉన్నాము. ఆ ఇంట్లో నువ్వు మాంసం తింటూ, మద్యం
త్రాగుతూ ఉంటే, నీ సంతానం సంగతి అటుంచు, మేము కూడా నరకానికి పోవలసివస్తుంది.”
“అలా జరగదమ్మా! జేమ్స్ తన ప్రయత్నంతో వాళ్ళ నడవడిక, ఆచార వ్యవహారాలను
సమూలంగా మార్చివేశాడు. ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరూ మాంసం తినరు, ఎటువంటి జంతువును
చంపరు. మద్యం కూడా మానివేశారు, స్నానం చేయకుండా వంట చేయడం, ఉతికిన బట్టలు
కట్టుకోకుండా వంటగదిలోనికి వెళ్ళడం మొదలైన వాటిని మానివేశారు. వాళ్ళు ఇంట్లో పండు,
పువ్వులుతో ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నారు. మనలాగే వాళ్ళు ఉన్నప్పుడు, వాళ్ళకి మనకి
తేడా ఏమిటి?”
తన కూతురితో వాదించడంలో విఫలమైన తేరాని విధుముఖి
విషణ్ణ వదనంతో లోపలికి వెళ్ళిపోయింది.
గాయత్రి రీసెర్చ్ పూర్తి అయి చాలా కాలం అయింది.
వయస్సు కూడా ఎక్కువే అయ్యింది. పెళ్ళి కాకుండా కన్యగానే చనిపోతుందేమోననే బాధతో తల్లి తండ్రులు
సతమతమవుతున్నారు. అకస్మాత్తుగా ఒకరోజున గాయత్రి జేమ్స్ లు ప్రేమ బంధంగా మారింది.
వివాహం వరుడి ఇంట్లోనే జరిగింది. అయితే వివాహ వేడుకలో పాలుపంచుకోవడానికి పండిత
నీలమణి శర్మకి, తేరాని విధుముఖిలకు బహుశ సిగ్గు అడ్డం వచ్చింది, అయితే తమ మనవరాలి
బారసాల మహోత్సవాన్ని మాత్రం చుట్టు పక్కల అందరిని పిలిచి ఎంతో ఘనంగా జరిపించారు.
బ్రాహ్మణులు ఇచ్చిన బారసాల పండుగలో అందరూ పాల్గొని విందారగించారు.